Unwanted Calls | న్యూఢిల్లీ: అత్యవసరమైన పనిలో ఉండగా మన ఫోన్లకు వచ్చే అవసరం లేని ప్రమోషనల్ బిజినెస్ కాల్స్, సందేశాలు చికాకు తెప్పిస్తుంటాయి. ఒక్కోసారి విపరీతమైన కోపానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి ఫోన్లు, మెసేజ్లకు త్వరలో చెక్ పడనున్నది. వీటి కట్టడికి సంబంధించి కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నిబంధనలపై జూలై 21న ప్రజలు అభిప్రాయాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించింది.
టెలికం సంస్థలు, రెగ్యులేటర్లు, ఇతర సంబంధిత వాటాదారులతో సంప్రదింపుల అనంతరం కేంద్రం ఈ ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించింది. వస్తువులు, సేవలకు సంబంధించిన కమ్యూనికేషన్ను ‘బిజినెస్ కమ్యూనికేషన్’గా ముసాయిదా మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అయితే ఇందులో నుంచి వ్యక్తిగత సంభాషణలను మినహాయించారు.
ఫోన్ కాల్ గ్రహీత సమ్మతి, రిజిస్టర్డ్ ప్రాధాన్యత అనుగుణంగా లేకుండా వచ్చే కమ్యూనికేషన్ను బిజినెస్ కమ్యూనికేషన్గా పేర్కొన్నాయి. గ్రహీతలు విముఖత వ్యక్తం చేస్తున్నా అన్రిజిస్టర్డ్ నంబర్లు లేదా ఎస్ఎంఎస్ హెడర్లను వినియోగించడం, కాల్ చేయడం, కాలర్ను గుర్తుపట్టలేని వంటి పరిస్థితులు అనధికార కమ్యూనికేషన్ కిందకు వస్తాయని తెలిపింది. కమర్షియల్ సందేశాలకు సంబంధించి ట్రాయ్ రూల్స్ను ఉల్లంఘించే కమ్యూనికేషన్స్ను కూడా ప్రతిపాదనలు నిషేధించాయి.