New Criminal Code : బ్రిటిష్ హయాంలోని పురాతన చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు (New Criminal Code) దేశవ్యాప్తంగా సోమవారం అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్) చట్టాలను తీసుకువచ్చారు.
ఇక నూతన నేర న్యాయ చట్టాల అమలు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. స్వాతంత్రం సిద్ధించిన 77 ఏండ్ల తర్విఆత మన నేర న్యాయ వ్యవస్ధ పూర్తిగా స్వదేశీగా మారిందని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. భారతీయ విలువల ఆధారంగా నూతన చట్టాలు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. వలసవాద చట్టాలకు పాతరేసి భారత పార్లమెంట్లో రూపొందిన చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు.
దండనకు బదులు ఇప్పుడు న్యాయం అందుబాటులోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నూతన చట్టాల అమలుతో జాప్యాలకు చెల్లుచీటీ సాధ్యమై విచారణ వేగవంతమై సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. గత చట్టాల హయాంలో కేవలం పోలీసుల హక్కులే కాపాడబడేవని, నూతన చట్టాల రాకతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కుల పరిరక్షణకు వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. కాగా ఈ క్రమంలో నూతన చట్టాల కింద తొలి కేసు నమోదయింది. అదికూడా దేశ రాజధానిలోనే (Delhi) కావడం గమనార్హం.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై (Street Vendor) గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. దీంతో దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉన్నదని, దానిని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 285 ప్రకారం.. కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్గా గుర్తించారు.
Read More :