Dharmendra Pradhan | న్యూఢిల్లీ, జూన్ 20: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్నెట్లో లీక్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. మంగళవారం ఈ పరీక్ష జరగగా, పరీక్షను రద్దు చేస్తున్నట్టు బుధవారం ఎన్టీఏ ప్రకటించింది. అయితే, పరీక్ష రద్దుకు స్పష్టమైన కారణాలను ఎన్టీఏ వెల్లడించలేదు. గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ.. డార్క్నెట్లో ఉన్న ప్రశ్నాపత్రం అసలైన యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రంతో సరిపోలుతున్నదని తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్పై ఆయన స్పందిస్తూ.. నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితమయ్యే అక్రమాల ప్రభావం నిజాయితీగా ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై పడకూడదని పేర్కొన్నారు. మన వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని, అక్రమాలు లేదా మాల్ప్రాక్టీస్లను తమ ప్రభుత్వం సహించదని పేర్కొన్నారు. ఎన్టీఏ పనితీరుపై సమీక్షకు త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీ ఎన్టీఏ పనితీరు మెరుగయ్యేందుకు తగు సూచనలు చేస్తుందని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైశ్వాల్ తెలిపారు. అయితే, భద్రతా సంస్థల నుంచి తమకు అందిన సమాచారం.. పరీక్ష సమగ్రత లోపించిందనే విషయాన్ని సూచించిందని, విద్యార్థుల ప్రయోజనాలకు రక్షణ కల్పించేందుకు సుమోటోగా పరీక్షను రద్దు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ విషయం ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్నందున ఎలాంటి సమాచారం అందిందనే విషయాన్ని వెల్లడించలేమని తెలిపారు. నెట్ పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.