Uddhav Thackeray : లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఠాక్రే మంగళవారం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో శివుడి ఫొటోను చూపేందుకు రాహుల్ను అనుమతించలేదని, ఇదేనా హిందూత్వ అంటే అని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీల్లో బహిరంగంగా జై శ్రీరాం అని అన్నారని, అయితే బీజేపీయేతర సభ్యులు ఒకరు సభలో ఇలా నినదిస్తే అది నేరమవుతుందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నిన్నటి ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని అన్నారు. బీజేపీ అంటే హిందూత్వ కాదని రాహుల్ విస్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
తామంతా హిందువులమేనని, తాము ఎవరం హిందుత్వను అవమానించబోమని, హిందుత్వను ఎవరూ అవమానించేందుకు తాము అనుమతించమని, రాహుల్ కూడా తమలో భాగమేనని ఠాక్రే స్పష్టం చేశారు.ఇక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్సభలో చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం కలకలం రేపుతోంది.
రాహుల్ వ్యాఖ్యలపై పాలక పక్షం అభ్యంతరాలతో స్పీకర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ధిష్ట వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు లోక్సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఈ అంశంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను పునరుద్ధరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలను తొలగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.
Read More :
Current Bills | పేటీఎం, ఫోన్పే, గూగుల్పేలో విద్యుత్ బిల్లుల చెల్లింపు బంద్