కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) బాత్రూమ్లో జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రంగంషూ రాయ్ తెలిపారు. బుధవారం రాత్రి ఇంట్లోని బాత్రూమ్లో కాలుజారి పడ్డారని, దీంతో తలకు గాయమైందని చెప్పారు. వెంటనే వామ్టింగ్ చేసుకున్నారని వెల్లడించారు. ఆయన ఇప్పటికే నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
అవసరమైన పరీక్షలన్నీ పూర్తిచేశారని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. దానినిబట్టి వైద్యులు తదుపరి చికిత్స ప్రారంభిస్తారని వెల్లడించారు. కాగా, 70 ఏండ్ల ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 2017లో బీజేపీలో చేరారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తర్వాత సొంతగూటికి చేరుకున్నారు.