Assam CM : అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. ఈ వరదలు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ స్పందించారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పారు. మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం చెబుతోందని, దాంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘గత రాత్రి నుంచి అసోంలో వరద పరిస్థితి మరింత తీవ్రమైంది. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఇతర నదుల్లో కూడా ప్రమాదకర స్థాయికి మించిన ప్రవాహం ఉన్నది. ఇదిలావుంటే నల్బరి, కర్బి అంగ్లాంగ్, దిమా హసావో, టిన్సుకియా తదితర ప్రాంతాల్లో రాగల మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అప్రమత్తం చేసింది. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని హెచ్చరించింది’ అని శర్మ చెప్పారు.
ఈ వరదలు 14 జిల్లాల్లోని 41 రెవెన్యూ సర్కిల్లు, 698 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపాయని శర్మ తెలిపారు. ఇప్పటివరకు 2.74 లక్షల మందిని వరదలు ప్రభావితం చేశాయని అసోం సీఎం వెల్లడించారు. నార్త్ లఖింపూర్లో దాదాపు 21 వేల మందిని వరదలు ప్రభావితం చేశాయని చెప్పారు.