న్యూఢిల్లీ: ఇద్దరు పిల్లలతో ఆగి ఉన్న కారును ఒక వ్యక్తి చోరీ చేశాడు. (Thieves Steal Car With Children) వారి పేరెంట్స్కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు కోసం వెతికారు. మూడు గంటల తర్వాత ఒక చోట వదిలేసిన కారులో ఉన్న పిల్లలను గుర్తించి కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణించారు. 11 ఏళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడ్ని కారులో వదిలేసి ఇంజిన్ ఆన్లో ఉంచి స్వీట్లు కొనేందుకు షాపు వద్దకు వెళ్లారు.
కాగా, ఇంజిన్ ఆన్లో ఉన్న కారులోకి ఒక వ్యక్తి ఎక్కాడు. ఇద్దరు పిల్లలతోపాటు డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వీట్లు కొనుగోలు చేసి వచ్చిన దంపతులు పిల్లలున్న తమ కారు మాయం కావడంతో షాక్ అయ్యారు. ఇంతలో పిల్లల తల్లికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో మరింత ఆందోళన చెందిన భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు కారు చోరీ, పిల్లల కిడ్నాప్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. సుమారు 50 మంది పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు, అందులోని పిల్లల కోసం వెతికారు. పలు రూట్లు మారిన ఆ వాహనాన్ని ట్రేస్ చేసి వెంటపడ్డారు. సుమారు మూడు గంటల పాటు 150 కిలోమీటర్ల మేర ఛేజింగ్ చేశారు. చివరకు సామాపూర్ బద్లీ ప్రాంతంలో రోడ్డు పక్కన వదిలేసిన కారును గుర్తించారు. అందులోని ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులకు వారిని అప్పగించారు.
కాగా, పరారైన నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.