Thief | చెన్నై: ఓ ఇంట్లో చోరీ పాల్పడిన దొంగ.. ‘క్షమించండి.. ఓ నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ నోట్ రాసి వెళ్లాడు. తమిళనాడులోని మేగ్నానపురంలో ఈ ఘటన జరిగింది. తమ కుమార్తెను చూడటానికి టీచర్ దంపతులు గత నెల 17న చెన్నై వెళ్లారు. మేగ్నానపురంలోని తమ ఇంటిని తరచూ శుభ్రం చేయడం కోసం ఓ మహిళను నియమించుకున్నారు. ఆమె గత నెల 26న ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లినపుడు, తలుపులు తెరచి ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే రిటైర్డ్ టీచర్ సెల్విన్కు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన వచ్చిన సెల్విన్ తన ఇంట్లోని రూ.60,000 నగదు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. పోలీసులు ఇంటిని పరిశీలించినపుడు ఓ లేఖ దొరికింది. దానిలో ‘నన్ను క్షమించండి. వీటన్నిటినీ ఓ నెలలో తిరిగి ఇచ్చేస్తాను. మా ఇంట్లో ఒకరికి అస్వస్థతగా ఉన్నందు వల్ల ఇలా చేస్తున్నాను’ అని రాసి ఉంది.