Thief | తమిళనాడు (Tamil Nadu) తూత్తుకుడిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిని దోచేసిన దొంగ.. దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ ఓ లేఖ రాసి పెట్టి వెళ్లాడు (Thief leaves apology note). ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేఘ్నాపురానికి (Megnanapuram) చెందిన చిత్తిరై సెల్విన్, ఆయన భార్య ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం కావడంతో వారంతా వేరే ఊళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 17న భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని ఓ కుమార్తెను చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటిని చూసుకునేందుకు సెల్వి అనే మహిళను నియమించుకున్నారు. సోమవారం సాయంత్రం సెల్వి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా తలుపులు తెరిచి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె వెంటనే యజమానికి తెలియజేసింది. దీంతో హుటాహుటిన చిత్తిరై సెల్వన్ చెన్నై నుంచి వచ్చి చూడగా.. బీరువాలో ఉన్న రూ.60 వేల నగదు, బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఓ లెటర్ దొరికింది. అది దొంగ రాసిన ఉత్తరంగా పోలీసులు గుర్తించారు. అందులో ‘నన్ను క్షమించండి. నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను. మా ఇంట్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది. అందుకే దొంగతనం చేశాను’ అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన పోలీసులు, ఇంటి యజమాని, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
Also Read..
Anant Weds Radhika | అంబానీ ఇంట సంప్రదాయ మామేరు వేడుక.. మెరిసిపోయిన పెళ్లికూతురు.. వీడియోలు
Team India | విమానంలో టీమ్ఇండియా సెలబ్రేషన్స్.. రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూశారా.. VIDEO