లక్నో, మే 20: లోక్సభ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. నిందితుడు ఎటా జిల్లా ఖిరియా పరమాన్ గ్రామ సర్పంచి, బీజేపీ నేత అనిల్ ఠాకూర్ కుమారుడిగా గుర్తించారు. అతని వయసు 17 ఏండ్లే కావడం గమనార్హం.
నయగావ్ పోలీసుస్టేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ 343లో 7-8 సార్లు ఓటేసినట్టు తేలింది. ఓటేసే సమయంలో సెల్ఫ్ వీడియో తీసుకొన్న యువకుడు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. ఫేక్ ఓటింగ్ ఘటనపై ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. సంబంధిత పోలింగ్ బూత్లో రీపోలింగ్కు సిఫారసు చేసినట్టు యూపీ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.