న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో కొత్త న్యాయ చట్టాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా అధినియం(బీఎస్ఏ) ఇక నుంచి అమలులో ఉండనున్నాయి. శిక్ష కంటే న్యాయం చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ కొత్త చట్టాలను చేసినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలా ఈ-ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
కొత్త చట్టం కింద మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ద్విచక్ర వాహనం దొంగతనానికి సంబంధించి మొదటి కేసు నమోదైనట్టు ఆయన తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు బదులుగా చేసిన కొత్త చట్టాలపై రాజకీయాలు చేయవద్దని ఆయన ప్రతిపక్ష పార్టీలను కోరారు. కాగా, 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత బలవంతంగా ఈ చట్టాలను చేశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సరైన చర్చ, సంప్రదింపులు జరపకుండా కొత్త చట్టాలను చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ఆరోపించారు.
ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్ అమలులోకి రావడంతో సెక్షన్లలో కూడా చాలా మార్పులు జరిగాయి. కాలం చెల్లినవి తొలగించి, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెక్షన్లు చేశారు. మొ త్తంగా ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా ఇప్పుడు బీఎన్ఎస్లో 358 చట్టాలు మాత్రమే ఉండనున్నాయి. సెక్షన్ల నెంబర్లు కూడా మారాయి. ఉదాహరణకు.. చీటింగ్ కేసుకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 420 ఉండేది. ఇది అందరి మెదళ్లలో ఎక్కువగా పాతుకుపోయింది. అనేక సినిమా డైలాగుల్లోనూ వినిపించింది. ఇప్పుడు బీఎన్ఎస్లో చీటింగ్ కేసుకు సెక్షన్ 318 వర్తించనుంది. ఇలా అనేక సెక్షన్లలో మార్పులు జరిగాయి