న్యూఢిల్లీ, జూన్ 12: నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి పేర్కొన్నది. పరీక్ష పవిత్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదని పురుద్ఘాటించింది. అయితే ఇది చెప్తూనే నీట్ పరీక్షలో 63 మంది విద్యార్థులు అక్రమ మార్గాలు ఉపయోగించారని, వారిలో 23 మందిని నీట్ రాయకుండా కొన్నేండ్లపాటు డీబార్ చేసినట్టు ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ బుధవారం వెల్లడించారు.
ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ సిఫార్సు మేరకు మిగిలిన 40 మంది విద్యార్థుల ఫలితాలను నిలుపుదల చేశామని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కీలకమైన నీట్ యూజీ-2024 పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు పెద్దయెత్తున వస్తున్న విషయం తెలిసిందే.