NEET PG | న్యూఢిల్లీ, జూన్ 22: నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల వివాదం నేపథ్యంలో నీట్-పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా శనివారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేసింది. పలు పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవలి ఆరోపణల నేపథ్యంలో నీట్-పీజీ పరీక్ష ప్రక్రియ పటిష్టతను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది. కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని వెల్లడించింది.
విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొన్నది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, పరీక్ష ప్రక్రియ పవిత్రతను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీక్ అయ్యిందని, అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు.
నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయడాన్ని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోల్ల శ్రీనివాస్ ఖండించారు. రాత్రికి రాత్రి పరీక్షను వాయిదా వేయడం కేంద్రం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను పరీక్ష వాయిదాతో కప్పి పుచ్చుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నీట్ పీజీ, యూజీ, నెట్ పరీక్షల వరుస వాయిదాలతో కేంద్రం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నదని విమర్శించారు.