పట్నా, జూన్ 22: ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మరో వంతెన తాజాగా కుప్పకూలింది. శనివారం ఉదయం సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కుప్పకూలింది. వారం వ్యవధిలో ఈ తరహా ఘటన ఇది రెండోది. దారౌందా, మహారాజా గంజ్ బ్లాక్స్లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్పై కట్టిన ఈ బ్రిడ్జ్..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు.
మంగళవారం అరారియా జిల్లాలో కొత్తగా నిర్మించిన 180 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ కుప్పకూలటం సంచలనం రేపింది. దీంతో నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.