Supreme Court | న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ర్టాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ మేరకు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం ఎస్సీలు సజాతీయులు కాబట్టి వర్గీకరణ చేయడానికి వీలు లేదంటూ ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం’ కేసులో 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా కొట్టివేసింది.
ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ సతీశ్చంద్ర మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 565 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. అయితే, ధర్మాసనంలోనే భాగమైన జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. రిజర్వేషన్లకు సంబంధించి చట్టాలు చేయడానికి, కులాలు, తెగల వర్గీకరణ, విభజన చేయడానికి రాష్ర్టాలకు చట్టబద్ధమైన అధికారం లేదని ఆమె పేర్కొన్నారు.
కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం.. షెడ్యూల్డ్ కులాల్లో వర్గీకరణ చేపట్టవచ్చా? 2004 నాటి సుప్రీం తీర్పు సరైనదా? అనే అంశాలను ముఖ్యంగా పరిశీలించి తీర్పునిచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం అన్ని షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతికి చెందినవి కావని ధర్మాసనంలోని న్యాయమూర్తులు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఎస్సీ కులాల వర్గీకరణ రాజ్యాంగంలోని 14, 341(2) అధికరణల ఉల్లంఘన కిందకు రాబోదని పేర్కొన్నారు. ఎస్సీల్లోని ఏదైనా కులానికి ప్రత్యేక ప్రయోజనాలు, ప్రాధాన్యం కల్పిస్తే మాత్రమే 341(2)ను ఉల్లంఘించినట్టు అవుతుందని తెలిపారు. వర్గీకరణ జరపకుండా రాష్ర్టాలను నియంత్రించేలా 15, 16వ అధికరణలు అడ్డుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లపై మండల్ తీర్పును ప్రస్తావిస్తూ.. వర్గీకరణ కేవలం ఓబీసీ కులాలకు మాత్రమే పరిమితం కాదని పేర్కొన్నారు.
షెడ్యూల్డు కులాల్లోని వివిధ ఉపకులాలు వేర్వేరు స్థాయిల్లో కొనసాగుతున్నందు వల్ల మరింత అర్థమయ్యే రీతిలో వర్గీకరించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపకులాల ప్రాతినిధ్యం, వెనుకబాటుతనం ప్రాతిపదికగా రాష్ర్టాలు వర్గీకరణ చేయవచ్చని, అయితే, ఈ ప్రాతిపదికను రాష్ర్టాలు ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొన్నది. వెనుకబాటుతనానికి ప్రభుత్వ ఉద్యోగాలు సూచికగా ఉపయోగిస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా కులాల ప్రాతినిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ర్టాలు సేకరించాలని తెలిపింది. ఇష్టానుసారం, రాజకీయ ప్రయోజనాల ప్రకారం చేయడానికి వీలులేదని, ఇది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం వర్తింపజేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొందరు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలను పొందుతున్నారని అన్నారు. ఎస్సీల్లోని క్రిమీలేయర్కు చెందిన పిల్లలను, పారిశుధ్య పనులు చేస్తూ దుర్భర దారిద్య్రంతో కొట్టుమిట్టాడే వారి పిల్లలతో సమానంగా పరిగణించడం సముచితం కాదని పేర్కొన్నారు. 1949లో అంబేద్కర్ ప్రసంగంలోని వ్యాఖ్యలను ఆయన ఉటంకిస్తూ ‘సామాజిక ప్రజాస్వామ్యం రానిదే, రాజకీయ ప్రజాస్వామ్యం రాదని’ అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్ వర్గాలను రాష్ర్టాలు గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి మినహాయించాలని ఆయన సూచించారు. జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అణచివేత అక్షర సత్యం: జస్టిస్ బీఆర్ గవాయ్ మరిన్ని వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ర్టాల ప్రధాన విధి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొందరు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. ఎస్సీ వర్గాల్లోనే చాలామంది శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నారన్నది అక్షర సత్యం. చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసుకు సంబంధించి 341వ రాజ్యాంగ అధికరణం రిజర్వేషన్ కోసం కులాన్ని గుర్తించే విషయాన్ని మాత్రమే వివరిస్తుంది. ఇక్కడ వర్గీకరణ అనేది ఒక పెద్ద గ్రూపులో వివక్షకు గురవుతున్న వర్గం వారికి సంబంధించినది.
ప్రస్తుతం ఓబీసీలకు అమలవుతున్న క్రిమీలేయర్ విధానాన్నే ఎస్సీలకు కూడా వర్తింపజేయాలి. రిజర్వేషన్ నుంచి క్రిమీలేయర్ పొందిన తర్వాత వారిని మినహాయించాలి.
రిజర్వేషన్ సదుపాయాన్ని కేవలం ఒక తరానికి మాత్రమే పరిమితం చేయాలి. తొలితరం ఉన్నత స్థానానికి చేరుకున్నట్టయితే రిజర్వేషన్ను రెండోతరానికి వర్తింపజేయాల్సిన అవసరం లేదు.
ఎస్సీల్లో ఉపకులాల వర్గీకరణ రాష్ర్టాలకు అప్పగించడం సముచితమే. అయితే అందుబాటులో ఉన్న సమాచారం అనుభవపూర్వకంగా సేకరించినదై ఉండాలి.
రాజ్యాంగంలోని 341వ అధికరణం కింద షెడ్యూల్డు కులాల జాబితాను ప్రకటించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. దీన్ని మార్చే అధికారం రాష్ర్టాలకు లేదు. పార్లమెంట్ చట్టాల ద్వారా మాత్రమే రాష్ట్రపతి జాబితాలో కులాల పేర్లను చేర్చడం లేదా తొలగించడం సాధ్యం. రాజకీయ లబ్ధి కోసం కులాలను ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోకి చేర్చకుండా నిరోధించడమే అధికరణం 341 ప్రధాన ఉద్దేశం. రాష్ట్రపతి జాబితాలో వర్గీకరణ కులాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెడితే ఇదే వర్గానికి చెందిన ఇతర కులాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. రాష్ర్టాలకు ఏవిధంగా కార్యనిర్వాహక లేదా శాసనాధికారం లేనందువల్ల వాటికి వర్గీకరణ చేసే అధికారం లేదు.
చారిత్రకంగా పరిశీలిస్తే షెడ్యూల్డు కులాలు ఒకే జాతిగా లేరు. వీరిలో వివిధ స్థాయిల్లోని వారు ఉన్నారు. కాబట్టి వీరిని వర్గీకరించడం సమానత్వపు హక్కును వివరిస్తున్న 14వ రాజ్యాంగ అధికరణను ఉల్లంఘించినట్టు కాదు. రాజ్యాంగం 341(2) అధికరణను కూడా ఇది అతిక్రమించబోదు. 15, 16 రాజ్యాంగ అధికరణలు ఈ వర్గీకరణను అడ్డుకోబోవు. వీరి ప్రాతినిధ్యం తగిన విధంగా లేని సమయాల్లో అందుబాటులో ఉన్న సముచితమైన ఆధారాల ప్రకారం ఉప కులాల వర్గీకరణ చేపట్టవచ్చు. అయితే, ఇది రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండకూడదు. అటువంటి నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది.
హైదరాబాద్, ఆగస్టు 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 25 శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ఇస్తూ 1975లో పంజాబ్ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ర్టాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దీంతో పంజాబ్లో దాదాపు 30 ఏండ్లపాటు జరుగుతున్న నియామకాలకు అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత ఈ ఆదేశాలను పక్కనబెట్టి 2006లోఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50 శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ఇస్తూ పంజాబ్ సర్కారు ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని అభిప్రాయపడింది. పంజాబ్ చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి గత ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వర్గీకరణ చేసుకొనేలా రాష్ర్టాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది.
ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును స్వా గతిస్తున్నా. దశాబ్దాలు గా వెనుకబడ్డ ఎన్నో కులాల ఈ తీర్పుతో కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. మూడు దశాబ్దాలు పోరాటాన్ని కొనసాగించిన మందకృష్ణ మాదిగ, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలకు అభినందనలు.
– బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నా. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు అభినందనలు.
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీ శ్రీనివాస్
ఎన్నో ఏండ్ల్ల పోరాటం.. ఎన్నో త్యాగాలకు గౌరవం దకింది. దళితులందరికీ ఇది పండుగ రోజు. ఇంటిం టా సంబురాలు జరుపుకొనే రోజు. తీర్పు ఆధారంగా ప్రభుత్వ నోటిఫికేషన్లలో యువతకు అవకాశం కల్పించాలి.
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
1965లో లాల్ బహదుర్ శాస్త్రి మంత్రివర్గంలో ఎస్సీ వర్గీకరణకు తొలి అడుగులు పడ్డాయి. ఉద్యమనేత కేసీఆర్ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరి విజయం.
– మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. ఇన్నాళ్లకు ఈ అంశానికి పరిష్కారం దొరికినందుకు సంతోషం. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ, ఇతర పెద్దలకు అభినందనలు.
– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు