న్యూఢిల్లీ/చెన్నై, జూన్ 10: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టాయి. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, పారదర్శక విచారణ చేయాలని జేఎన్యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అవిజిత్ ఘోష్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రవేశ పరీక్ష సమగ్రతను కాపాడేందుకు మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన పరీక్షా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, నీట్ అంశంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల విడులైన నీట్-యూపీ పరీక్షా ఫలితాల్లో ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చెబుతున్నది.
కౌన్సెలింగ్పై స్టే విధించాలి
నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదేవిధంగా మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేయాలని, పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు కౌన్సెలింగ్పై స్టే విధించాలని పిటిషన్దారులు అభ్యర్థించారు. పరీక్ష నిర్వహణ హేతుబద్ధంగా లేదని, విద్యార్థులకు బ్యాక్డోర్ ద్వారా ప్రవేశాలు కల్పించేలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ప్లస్ 2 మార్కులే ప్రామాణికంగా ఉండాలి
నీట్ ప్రవేశపరీక్షను తొలగించేందుకు చట్ట, శాసనపరమైన చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రాజన్ నేతృత్వంలోని కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్(ప్లస్ 2) తరగతిలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచి ంచింది. వివిధ పరీక్ష బోర్డుల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. తమిళనాడు విద్యార్థులపై నీట్ ప్రభావంపై అధ్యయనానికి ఈ కమిటీని డీఎంకే ప్రభుత్వం 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసింది.