CBSE | న్యూఢిల్లీ: ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12 తరగతులకు ఒక ఏడాదిలో రెండుసార్లు వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని సీబీఎస్ఈ కేంద్ర విద్యాశాఖకు స్పష్టం చేసింది. జూన్ 25న ఢిల్లీలో జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్-2023పై జరిగిన సీబీఎస్ఈ, విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఈ విషయాన్ని విద్యాశాఖకు వెల్లడించామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీబీఎస్ఈ అధికారి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ స్కూళ్లలో బోర్డు పరీక్షలు నిర్వహించాలంటే 4 వేల ప్రశ్నాపత్రాలు, 20 వేల ప్రశ్నలు రూపొందించాలని… 2.5 కోట్ల సమాధానపత్రాలను దిద్దాలని ఆయన చెప్పారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులపై భారం తగ్గించడానికి వీలైతే 2025-26 విద్యా సంవత్సరం లేదా ఆ తర్వాత ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఎస్ఈకి ప్రతిపాదించింది.