న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ.. దేశంలో అతిపెద్ద, చీకటి అధ్యాయం అని, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత, గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ విధానాలకు ప్రజలు ఇచ్చిన ఆమోదంగా ఆమె అభివర్ణించారు.
ఈవీఎంలు సహా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు భగ్నమయ్యాయని ఆమె పేర్కొన్నారు. నీట్, నెట్ పరీక్షల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఆమె తన ప్రసంగంలో స్పందించారు. పారదర్శక విచారణ జరిపించి, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ఆయుష్మాన్భారత్ యోజన కింద 70 ఏండ్లు పైబడినవారికి కూడా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి నిరసనకు దిగారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రసంగం పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ అని, మొత్తం అబద్ధాలేనని పేర్కొన్నాయి. రాష్ట్రపతితో అబద్ధాలు చదివించడం ద్వారా ప్రశంసలు పొందేందుకు మోదీ వ్యర్థప్రయత్నం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
పార్లమెంటులో శుక్రవారం నీట్లో అక్రమాల అంశాన్ని లేవనెత్తాలని ఇండియా కూటమిలోని పార్టీలు నిర్ణయించాయి.