లక్నో: శవాలను కూడా దోచుకుంటున్నారు. పోస్ట్మార్టం కోసం తరలించే మృతదేహాలపై ఉండే బంగారం, వెండి నగలను చోరీ చేస్తున్నారు. (stealing jewellery from corpses) వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్ సోదరి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తన సోదరి ముక్కు పుడక, చెవి రింగులు మాయమైనట్లు మహిళా కానిస్టేబుల్ ఆరోపించింది. చీఫ్ మెడికల్ అధికారికి దీని గురించి ఫిర్యాదు చేసింది.
కాగా, ఈ రాకెట్కు సంబంధించి ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహతాష్ కుమార్ తెలిపారు. దర్యాప్తు కోసం నలుగురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరోవైపు తాను నిర్దోషినని తొలగించిన వార్డ్ బాయ్ రూపేష్ పటేల్ తెలిపాడు. పోస్ట్మార్టం విభాగంలోని చాలా మంది ఉద్యోగులు ఈ రాకెట్లో భాగమని ఆరోపించాడు. మృతదేహాల నుంచి ఆభరణాల చోరీకి సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనపై మోపిన నింద గురించి మాట్లాడనీయకపోవడంతో ఈ వీడియోను రిలీజ్ చేసినట్లు వెల్లడించాడు.