Speaker election : కొత్త లోక్సభ (Lok Sabha) కొలువుదీరింది. సోమవారం 18వ లోక్సభ తొలి సెషన్ మొదలైంది. సీనియర్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారాలు చేయిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ప్రమాణస్వీకారాలు కొనసాగుతున్నాయి. మంగళవారంతో ఎంపీల ప్రమాణస్వీకారాలు ముగియనున్నాయి.
అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే ఎన్డీఏ ఊహించినట్టుగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. అధికార ఎన్డీఏ కూటమి తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున ఎంపీ కే సురేష్ నామినేషన్ వేశారు. దాంతో దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగబోతున్నాయి. రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. అంతకుముందు ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కాగా లోక్సభలో అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉండగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. తొలిసారి లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగుతుండటంతో.. స్పీకర్ను ఎలా ఎన్నుకుంటారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. కొత్త స్పీకర్గా ఎవరు ఎన్నికవుతారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా పాత లోక్సభ రద్దుకాగానే ఎంపీల పదవీకాలం ముగిసిపోతుంది. కానీ స్పీకర్ పదవి వెంటనే ఖాళీ కాదు. కొత్త లోక్సభ తొలి సెషన్ ప్రారంభం అయ్యేదాకా స్పీకర్ పదవీకాలం కొనసాగుతుంది. ఆ తర్వాతే ఆ పదవి ఖాళీ అవుతుంది.
సోమవారం కొత్త లోక్సభ కొలువుదీరగానే 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పదవీకాలం ముగిసింది. స్పీకర్ పదవి ఖాళీ అయ్యింది. దాంతో సీనియర్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ను నూతన స్పీకర్గా నియమించారు. తొలి రెండు రోజులు ఎంపీల ప్రమాణస్వీకారాలు పూర్తయ్యే వరకు ఆయన ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత శాశ్వత స్పీకర్ సభను నడుపుతారు. కాబట్టి బుధవారం కొత్త స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నికకు ప్రత్యేక రూల్స్ అంటూ ఏమీ లేవు.
సభలోని సభ్యులంతా స్పీకర్ ఎన్నిక కోసం జరిగే ఓటింగ్లో పాల్గొంటారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే లోక్సభ కొత్త స్పీకర్ అవుతారు. స్పీకర్ పదవికి పోటీపడే అభ్యర్థి కూడా సభలో సభ్యుడై ఉంటే చాలు.. వేరే ఏ ప్రత్యేక అర్హతలు అక్కర్లేదు. అయితే సభలో సంఖ్యాబలం పరంగా చూస్తే అధికార కూటమి బరిలో దించిన ఓం బిర్లానే స్పీకర్ పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ గెలువాలంటే ఎన్డీఏ కూటమి ఎంపీల ఓట్లు కూడా పడాలి. కానీ అది జరగడం అసంభవమనే చెప్పవచ్చు.