బెంగళూరు: అబ్బాయిలతో మాట్లాడుతున్నారన్న కోపంతో సవతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఆడ పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. (Sisters found dead) ఇంటి నుంచి పారిపోయిన అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన అనిత పదేళ్ల కిందట మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. అతడి ద్వారా ఇద్దరు ఆడ పిల్లలున్న ఆమె మూడేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నది. మ్యాట్రీమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన మోహన్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.
కాగా, అనిత ఇద్దరు కుమార్తెలైన 16 ఏళ్ల సోని, 14 ఏళ్ల సృష్టి శనివారం వారి ఇంట్లో హత్యకు గురయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన అనిత తన ఇద్దరు కుమార్తెల గొంతులు కోసి రక్తం మడుగుల్లో పడి చనిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన కుమార్తెలు స్కూల్లో అబ్బాయిలతో మాట్లాడటం పట్ల రెండో భర్త మోహన్ ద్వేషం పెంచుకున్నాడని ఆమె ఆరోపించింది.
మరోవైపు మోహన్ ఆ ఇంటికి వచ్చి అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అక్కాచెల్లెళ్లను అతడే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆడ పిల్లల హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సవతి తండ్రి మోహన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.