చెన్నె, జూలై 4: తమిళనాడులోని తెన్కాశి జిల్లా కుర్తాళంలో ఉండే సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి (88) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో మంగళవారం ఆయనను చెన్నైలోని కావేరి దవాఖానలో చేర్చారు. వెంటనే కరోనరీ యాంజియోగ్రఫీ నిర్వహించిన వైద్యులు ఎలక్టివ్ యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సిద్ధేశ్వరానందను కలుసుకునేందుకు భక్తులు ఎవరూ రావొద్దని పీఠం నిర్వాహకులు కోరారు.
15 రోజుల్లో 10 వంతెనలు
పాట్నా, జూలై 4: బీహార్లో కూలిన వంతెనల సంఖ్య 10కి చేరింది. గురువారం సరన్ జిల్లాలో గండకీ నదిపై నిర్మించిన చిన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 15 ఏండ్ల క్రితం ఈ వంతెనను నిర్మించారు. ఈ జిల్లాలో గత 24 గంటల్లో ఈ తరహా ఘటన ఇది మూడోదని జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. చిన్న వంతెనలు కూలిపోతుండటంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా చిన్న వంతెనలు కూలిపోతూ ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. మరోవైపు వంతెనల నిర్మాణంపై ఆడిట్ నిర్వహించేలా బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని బ్రజేశ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దేశంలో ఎక్కువగా వరదలకు ప్రభావితమయ్యే రాష్ట్రం బీహారేనని తెలిపారు.
బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో కేరళలో బాలుడు మృతి
తిరువనంతపురం: మెదడు తినే అమీబా సోకి కేరళలోని కోజికోడ్కు చెందిన 14 ఏండ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (మెదడు తినే అమీబా) బ్యాక్టీరియా బారిన పడ్డ మృదుల్ (14) అనే బాలుడు గతకొద్ది రోజులుగా కోజికోడ్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకుంటూ, బుధవారం తుదిశ్వాస విడిచాడు. ఓ చెరువులో కొద్ది రోజుల క్రితం ఈతకు వెళ్లిన మృదుల్కు, అక్కడి నీటి ద్వారా అమీబా బ్యాక్టీరియా సోకి ఉండొచ్చని వైద్య వర్గాలు అంచనావేశాయి. కేరళలో అమీబా సోకి వ్యక్తి మరణించటం ఈ ఏడాది మే తర్వాత ఇది మూడో కేసు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా సాధారణంగా చెరువులు, సరస్సులు, నెమ్మదిగా కదులుతున్న నదుల్లో ఉంటాయి. చాలా అరుదుగా మానవ శరీరంలోకి ప్రవేశించి వివిధ అనారోగ్యాలకు కారణమవుతాయి.