Jarjkhand : జార్ఖండ్లో జేఎంఎం సారధ్యంలోని అవినీతి సర్కార్ను సాగనంపేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పవిత్ర జార్ఖండ్ భూమిపై అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జార్ఖండ్ అద్భుతమైన వనరులు కలిగిన గొప్ప రాష్ట్రమని చెప్పారు. అభివృద్ధికి ఈ రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని వివరించారు. తమ సిద్ధాంతమే తమ బలమని ఆయన చెప్పుకొచ్చారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎంకు పరాజయం తప్పదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి, నిరంకుశ సంకీర్ణ సర్కార్ను సాగనంపి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రజల అడుగులు పడుతున్నాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్య నిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సొరేన్ గురువారం మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.
రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ ముఖ్యమంత్రి చంపయూ సొరేన్, హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సొరేన్, తల్లి రూపి సొరేన్, భార్య కల్పన సొరేన్, జేఎంఎం కూటమి నేతలు హాజరయ్యారు. ఐదు నెలల క్రితం మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లేముందు జనవరి 31న హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ తర్వాత చంపయూ సొరేన్ సీఎం పగ్గాలు చేపట్టి, తాజాగా రాజీనామా చేశారు. దీంతో హేమంత్ సొరేన్ మరోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
Read More :
Harish Rao | ప్రజాపాలనలో నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కులేదా: హరీశ్ రావు