న్యూఢిల్లీ: నీట్-యూజీ 2024(NEET-UG 2024) పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. నీట్ రద్దుపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సుప్రీంకు మార్చాలని ఎన్టీఏ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. జూలై 8వ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు చెప్పింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు పెట్టుకున్న పిటీషన్పై కూడా కోర్టు విచారణ చేపట్టనున్నది. నీట్ నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా.. దాన్ని సరైన రీతిలో పరిష్కరించాలని సుప్రీం పేర్కొన్న విషయం తెలిసిందే. మే 5వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ పరీక్షలను 24 లక్షల మంది రాశారు.