Operation Lotus : ఆపరేషన్ లోటస్ ద్వారా ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలని బీజేపీ కోరుకుంటోందని శిరోమణి అకాలీ దళ్ ( (SAD) ఢిల్లీ చీఫ్ పరంజిత్ సింగ్ సర్నా బుధవారం ఆరోపించారు. ఇది బూటకపు ఆరోపణ అని కాషాయ పార్టీ భావిస్తే ఆ పార్టీ నేతలను తాను చర్చకు ఆహ్వానిస్తానని, వారు ఆపరేషన్ లోటస్ చేపట్టినట్టు నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు.
ప్రాంతీయ పార్టీలను కబళించాలని, నిర్వీర్యం చేయాలని బీజేపీ భావిస్తోందని, దీన్ని తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అకాలీ దళ్ వెనుకబడిన క్రమంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వైదొలగాలని కొందరు పార్టీ నేతలు అసమ్మతి గళం వినిపించిన క్రమంలో పరంజిత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్గతంగా అసమ్మతి ఎదుర్కొంటున్న బాదల్కు లోక్సభ ఎన్నికల ఫలితాలు మరింత ప్రతికూలంగా మారాయి. పార్టీ నాయకత్వంలో మార్పులు చేపట్టాలని సీనియర్ నేతలు పర్మీందర్ సింగ్ ధిండ్సా, బిది జాగీర్ కౌర్ సహా పలువురు తిరుగుబాటు బావుటా ఎగరవేయగా, మరికొందరు సీనియర్ నేతలు బాదల్కు బాసటగా నిలిచారు.
ఇక ఈ ఆరోపణలపై ఎస్ఏడీ ఎంపీ, బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ బాదల్ స్పందిస్తూ ఎస్ఏడీ పార్టీ శ్రేణులన్నీ బాదల్ వెనుక నిలిచాయని, కొందరు బీజేపీ నేతలు ఎస్ఏడీని చీల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు మహారాష్ట్రలోనూ ఇదే చేశారని దుయ్యబట్టారు. 117 మంది నేతల్లో కేవలం అయిదుగురు మాత్రమే బాదల్కు వ్యతిరేకంగా ఉన్నారని, మిగిలిన 112 మంది నేతలు పార్టీ పట్ల, సుఖ్బీర్ సింగ్ బాదల్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని చెప్పారు.
Read More :
Varalaxmi Sarathkumar | సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్కుమార్ వెడ్డింగ్ ఇన్విటేషన్.. ఫొటోలు వైరల్