లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో కాషాయ సర్కార్ కొలువుతీరిన యూపీ రాజధాని లక్నో స్మార్ట్సిటీ బాగోతం బట్టబయలైంది. స్వయంగా సీఎం కార్యాలయం సమీపంలోని రోడ్డు గుంతల మయంగా మారింది. సెంట్రల్ లక్నోలోని కైసర్బాగ్ వద్ద రహదారి గుంతలు పడటంతో 8-10 అడుగుల లోతున గండిపడింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. రోడ్డుపై భారీ గండి పడటంతో అధికారులు, పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేయడంతో పాటు ట్రాఫిక్ను దారి మళ్లించారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన 100 స్మార్ట్ సిటీ మిషన్లో లక్నో ఎంపికవడంతో నగరంలో పలు పనులను చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అట్టహాసంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి.