Manoj Jha : హథ్రాస్ తొక్కిసలాట ఘటన విషయంలో కాషాయ పాలకుల తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలపై ఎన్ని కమిటీలు వేస్తారని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రశ్నించారు. రెండ్రోజుల హడావిడి అనంతరం ఈ వ్యవహారంపై అసలు చర్చే జరగదని మనందరికీ తెలుసునని అన్నారు. భారత్ ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో జనం హాజరవుతారని స్ధానిక అధికారులకు తెలియదా అని ఆయన నిలదీశారు.
దురదృష్టకర ఘటన చోటుచేసుకున్న అనంతరం కంటితుడుపు చర్యలు చేపడుతున్నారని అన్నారు. కాగా, యూపీలోని హథ్రాస్లో భోలే బాబా సత్సంగ్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. అనేక మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో నిందితుడు భోలే బాబాపై ఆగ్రా, ఎతావాహ్, కస్గంజ్, ఫరూఖాబాద్, దూసా ప్రాంతాల్లో ఐదు లైంగిక దాడి కేసులు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
1997లో ఓ కేసులో అరెస్టయి కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తున్నది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తన గ్రామంలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునే భోలే బాబా.. కాషాయానికి బదులుగా తెల్లటి సూటు, బూట్లు, నల్ల కండ్లద్దాలు ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు.తనను నమ్మే వారిని భోలే బాబా అనేక మూఢ నమ్మకాలతో ముంచేశాడని తెలుస్తున్నది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు.
Read More :