న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్తో టీమ్ఇండియా సగర్వంగా భారత్ చేరింది. 13 ఏండ్ల తర్వాత ఐఐసీ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చింది. అయితే టీమ్ఇండియాను భారత్కు తీసుకొచ్చిన ఎయిర్ ఇండియాకు (Air India) డీజీసీఏ నోటీసులిచ్చింది. భారత జట్టు వచ్చిన ప్రత్యేక విమానం షెడ్యూల్ ప్రకారం అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి రావాల్సి ఉన్నది. అయితే భారత జట్టును ఇంటికి తీసుకురావడం కోసం ఆ సర్వీసు రద్దుచేసిన ఎయిర్ ఇండియా.. దానిని బార్బడోస్కు మళ్లించింది.
దీంతో అప్పటికే టికెట్లు బుక్చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇంబ్బందులకు గురయ్యారు. విమానయాన సంస్థ తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఎయిర్ ఇండియాను డీజీసీఏ నివేదిక కోరింది. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎందుకు రద్దుచేయాల్సి వచ్చిందో తెలపాలంటూ నోటీసులు ఇచ్చింది. కాగా, టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు వెస్టీండీస్లోని బార్బడోస్లోనే చిక్కుకుపోయింది. తుఫాను కారణంగా విమానాలను నిలిపివేశారు. దీంతో టీమ్ఇండియా అక్కడే చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం బార్బడోస్ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో భారత జట్టు బయలుదేరి, ఈ రోజు ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఏయిర్ ఇండియాను వివాదంలోకి నెట్టివేసింది.
దీనిపై ఎయిర్ ఇండియా అధికారి మాట్లాడుతూ.. వాస్తవానికి భారత జట్టు ప్రయాణించాల్సిన విమానాన్ని సదరు సంస్థ రద్దు చేసింది. దీంతో బీసీసీఐ ఎయిర్ ఇండియాను సంప్రదించింది. అయితే, నెవార్క్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నెవార్క్-ఢిల్లీ ఫ్లైట్లో బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ముందుగానే సమాచారం అందించామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశామన్నారు.