Rath Yatra : పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుంటారు. జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చివరిసారిగా 1971లో ఒకే రోజున మూడు వేడుకలు జరగ్గా 53 ఏండ్ల తర్వాత ఇది పునరావృతమైంది. ఇక రథయాత్రకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రథయాత్ర ఏర్పాట్లపై ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఇరువురు డిప్యూటీ సీఎంలు కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్తో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఇక రథయాత్రకు గత ఏడాది కంటే అత్యధికంగా ఈసారి 315 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఒడిషాలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ రైళ్లు నడుస్తాయని చెప్పారు. ప్రత్యేక రైళ్లతో పాటు పూరిలో 15,000 మందికిపైగా వసతి సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
రథయాత్ర ప్రత్యేకతలివే..
పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
Read More :