Nirmala Sitaraman | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల పట్ల ద్వేషంతో ప్రారంభమైన రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో ముగుస్తాయని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఆయన బాటనే అనుసరిస్తాయని సోమవారం పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చర్చలో పాల్గొంటూ హిందువులు 24 గంటలూ ద్వేషం, హింసకు పాల్పడటంపైనే దృష్టిని కేంద్రీకరిస్తారంటూ అధికార బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చలో జోక్యం చేసుకుంటూ యావత్తు హిందూ సమాజానికి హింసను ఆపాదించడం తీవ్రమైన అంశం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన రాహుల్ గాంధీ.. తాను బీజేపీ గురించి మాట్లాడుతున్నానని తేల్చి చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ సమాజానికి ప్రతినిధులు కారంటూ తిప్పి కొట్టారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘తనను తాను హిందువుగా చెప్పుకుంటున్న విపక్ష నేత రాహుల్ గాంధీ.. హిందువులంతా ద్వేషం, ధిక్కార స్వభావం కలిగి ఉంటారని చెబుతున్నారు. హిందువుల పట్ల ఆయన కపటత్వం బయట పడింది` అని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మాత్రమే స్పందించే హక్కు ఉంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో మొదలై ద్వేషంతోనే ముగుస్తాయి. ఆయన బాటనే ఇండియా కూటమి నేతలు అనుసరిస్తారంటే ఆశ్చర్యమేమీ లేదు’ అని మరో ‘ఎక్స్’ పోస్టులో నిర్మలాసీతారామన్ తెలిపారు.
Coca-Cola | భారత్ మార్కెట్కు కోకా కోలా గుడ్బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!
Small Cap Funds | 27 స్మాల్ క్యాప్ ఫండ్స్లో బెంచ్ మార్క్ రిటర్న్స్ అందించిన ఫండ్స్ ఇవే..!