న్యూఢిల్లీ: రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) లోక్సభలో మాట్లాడారు. గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా అయ్యే వరకు ఎటువంటి బాధ్యత లేకుండా రాహుల్ అధికారం ఎంజాయ్ చేసినట్లు ఠాకూర్ ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న వారు మూడోసారి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెప్పిన బీజేపీ నేత.. ఇప్పుడు కాంగ్రెస్ నేత వద్ద అధికారంతో పాటు బాధ్యత కూడా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా రాహుల్ గాంధీ ఎటువంటి బాధ్యత లేకుండా అధికారాన్ని అనుభవించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతకు అగ్నిపరీక్ష మిగిలిందన్నారు. ఆయన అసలు లోక్సభలో రోజంతా కూర్చుంటారు, ఇప్పుడు అయితే అతను సీటులో లేడని అన్నారు. రాహుల్ సభలో లేని సమయంలో అనురాగ్ ఠాకూర్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేందని, కానీ గత పదేళ్లలో ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినట్లు ఠాకూర్ తెలిపారు.