Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లోక్సభలో విపక్ష నేతగా `పూర్తిగా బాధ్యతా రాహిత్య` ప్రసంగం చేశారని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిరెన్ రిజిజు ఆరోపించారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాను అప్రతిష్ట పాల్జేస్తున్నారని సోమవారం మండిపడ్డారు. ‘అగ్నిపథ్’ స్కీం మొదలు అయోధ్యలో స్థానికులకు పరిహారం వరకూ అన్ని అంశాలపై అసత్యాలే పలికారన్నారు. హిందువులు హింసకు పాల్పడుతూ అసత్యాలను వ్యాప్తి చేస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు వారిని కించపర్చడమేనన్నారు.
రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ సవాల్ చేస్తుందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని స్పీకర్ను కోరుతుందన్నారు. రాహుల్ గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్ని పథ్ తోపాటు అయోధ్యలో అభివృద్ధి పనులకు స్థానికుల నుంచి తీసుకున్న భూములకు పరిహారంపై రాహుల్ వ్యాఖ్యలను అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. అయోధ్యలో షాపుల యజమానులకు రూ.1,253 కోట్ల పరిహారం చెల్లించారని గుర్తు చేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయితోపాటు బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, సుష్మ స్వరాజ్ వంటి వారు లోక్ సభలో విపక్ష నేత పదవికి వన్నె తెచ్చారని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ఏ బాధ్యతలేకుండా అధికారం చలాయించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడే బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చారని, కానీ అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రాజ్యంగ సంస్థలను బలహీన పరిచిందని అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రతులను రాహుల్ గాంధీ చించి పారేశారని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ సారధ్యంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్.. షాడో ప్రభుత్వంలా వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. ఎమర్జెన్సీ హయాంలో ఏం జరిగిందో దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.