రోమ్: ఇటలీ(Italy)లో వ్యవసాయ కార్మికుడిగా పని చేస్తున్న 31 ఏళ్ల పంజాబీ వ్యక్తి విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయక్షేత్రంలో పనిచేస్తున్న సమయంలో అతని చేయి తెగిపోయింది, అయితే ఉద్యోగం కల్పించిన యజమానులు ఆ వ్యక్తికి వైద్యం అందించకుండా అతన్ని రోడ్డుపై వదిలేశారు. రోమ్ వద్ద ఉన్న లాజియోలోని కూరగాయల క్షేత్రంలో సత్నం సింగ్ పనిచేస్తున్నాడు. హెవీ మెషినరీతో పనిచేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు.
రోమ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ దీనిపై ప్రకటన చేసింది. భారతీయ వ్యక్తి మృతిచెందడం దురదృష్టంగా భావిస్తున్నట్లు ఎంబసీ వెల్లడించింది. ఉద్యోగం కల్పించిన ఆంటోనెల్లో లొవాటో.. భారతీయ కార్మికుడిని నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెగిన చేయిని ఫ్రూట్ బాక్సులో పెట్టారు. కానీ చికిత్స ఆలస్యం కావడంతో.. అతన్ని హెలికాప్టర్లో రోమ్కు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండాపోయింది.
నిర్లక్ష్యం చూపిన ఓనర్ లొవాటోపై క్రిమినల్ కోణంలో విచారణ చేపడుతున్నారు. మెషీన్ వద్దకు వెళ్లవద్దంటూ సింగ్కు చెప్పినా అతను పట్టించుకోలేదని లవాటో తండ్రి తెలిపాడు. సింగ్ మృతి పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందించారు. అది అమానవీయ చర్య అని, ఆ క్రూరత్వాన్ని శిక్షించాలని ఆమె అన్నారు.