PM Modi greets : అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి మరీ కెప్టెన్ రోహిత్శర్మను, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని, కోచ్ రాహుల్ ద్రవిడ్ను ప్రధాని అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయత్వం అద్భుతమని ఆయన ప్రశంసించారు. భారత జట్టుకు కోచ్గా రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫైనల్ మ్యాచులో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని, ఆఖరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాను, సూపర్ క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ను, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా శనివారం రాత్రి టీమ్ ఇండియా మ్యాచ్ గెలిచిన తరువాత మోదీ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దేశ ప్రజలందరి తరుపున భారత జట్టుకు అభినందలు తెలిపారు.
140 కోట్ల మంది భారతీయులు మీ ఆట చూసి గర్వపడుతున్నారని పేర్కొన్నారు. ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా గెలువడం అంత సులభమైన విషయం కాదన్నారు. ‘మీరు మైదానంలో ప్రపంచ కప్ను గెలుచుకున్నారు. దేశంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ (76), అక్షర్ పటేల్ (47) లు రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్రిచ్ నోర్జే, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో జెన్సెన్, రబాడలు చెరో ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (52), ట్రిసన్ స్టబ్స్ (31), క్వింటన్ డికాక్ (39) రాణించినా ఓటమి తప్పలేదు.