PM Modi : లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్సభలో బదులిస్తూ పలు అంశాలపై ప్రసంగించారు. ప్రజలు తమ పాలన, ట్రాక్ రికార్డు చూశారని చెప్పారు. తమ పదేండ్ల హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. అవినీతిని ఏమాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్ధంలో భారత్ ఖ్యాతి పెరిగిందని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సభలో నిన్న, ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారని తెలిపారు.
వీరు పార్లమెంట్ నిబంధనలను అనుసరిస్తూ అనుభవం కలిగిన పార్లమెంటేరియన్లలా వ్యవహరించడం సంతోషకరమని చెప్పారు. వీరు తొలిసారి చట్టసభలకు ఎన్నికైన సభ హుందాతనాన్ని పెంచేలా ప్రవర్తించారని ప్రశంసించారు. వారి అభిప్రాయాలతో చర్చను మరింత ఫలప్రదం చేశారని పేర్కొన్నారు. లౌకిక వాదం అంటే సామాజిక న్యాయం పాటించడమని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు తమపై భరోసా ఉంచారని అన్నారు. వికసిత్ భారత్తో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని అన్నారు. తమ ప్రభుత్వ పధకాలు సామాన్యులకు చేరుతున్నాయని చెప్పారు.
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు
ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మణిపూర్, నీట్ అంశాలపై మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మోదీ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. విపక్ష సభ్యుల తీరుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్లోకి పంపేలా విపక్ష నేతలు వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు.