PM Modi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో బదులిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. రాబోయే ఐదేండ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పారు. గత పదేండ్ల అనుభవాలతో తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఈ ఐదేండ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించే నాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజలను విపక్షాలు అవమానిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వల్లే తనలాంటి వారు పార్లమెంట్ వరకూ రాగలిగారని పేర్కన్నొరు. కాంగ్రెస్ హయాంలో రూ. 60000 కోట్ల వరకూ రైతుల రుణాలు మాఫీ చేసినా లబ్ధిదారుల జాబితాలో చిన్న, సన్నకారు రైతుల పేర్లు చేర్చలేదని ఆరోపించారు.
సభ నుంచి విపక్షాల వాకౌట్
రాజ్యసభలో ప్రధాని ప్రసంగానికి విపక్షాలు అడుగడుగునా అడ్డుతగిలాయి. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సభ్యులు గందరగోళం సృష్టించారు. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలారు. పాలక పక్ష తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
విపక్షాలు ఎగువ సభ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానించడం తగదని, వారి తీరు మారకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేసే వారికి నిజాన్ని వినే ధైర్యం లేదని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చర్చల్లో వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే వినే ధైర్యం వారికి లేకపోయిందని ఎద్దేవా చేశారు.
Read More :
Vande Bharat | ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్ ట్రయల్ రన్..!