Rahul Gandhi | న్యూఢిల్లీ, జూన్ 20: నీట్లో అక్రమాల ఆరోపణలతో 24 లక్షల మంది విద్యార్థుల భవిత ఆందోళనలో ఉన్న వేళ, ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ-నెట్ పరీక్షనూ రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నదని మండిపడ్డాయి. దేశంలో ‘ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ’ పరిస్థితులు తలెత్తాయని ఆరోపించాయి. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్ – గాజా యుద్ధాలను ఆపారని చెప్తున్న మోదీ పేపర్ లీకేజీలను ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పేపర్ లీకులను ఆపాలని మోదీ అనుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఏదైనా ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదని, ఒక పరీక్షకు వర్తించిన నియమాలు మరో పరీక్షకు కూడా వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రతీయేటా ‘పరీక్ష పే చర్చ’ పేరుతో ప్రధాని మోదీ పెద్ద తమాషా చేస్తారని, మరోవైపు ఆయన ప్రభుత్వం లీకులు, అక్రమాలు లేకుండా పరీక్షలు నిర్వహించలేకపోతున్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రోజుకో ప్రశ్నాపత్రం లీక్ అవుతుండటం ఏ రకమైన ‘పరీక్ష పే చర్చ’ అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రధానమంత్రి ‘లీక్ పే స్పీక్’ నిర్వహించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం దేశ విద్యా, నియామకాల వ్యవస్థను నాశనం చేసిందనేది నీట్, యూజీసీ-నెట్, సీయూఈటీ పరీక్షలు బహిర్గతం చేశాయన్నారు. ఉద్యోగ నియామకాలు అన్నింటికీ ఒకే పరీక్ష పెడతామని చెప్తూ మోదీ చెప్పిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) నాలుగేళ్లుగా ఒక్క పరీక్షను నిర్వహించలేదని పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణలో అసమర్థత పునరావృతం కావడం విద్యార్థులను అనిశ్చితిలోకి నెట్టేస్తున్నదని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బీజేపీ పాలనలో పేపర్ మాఫియా ఒకదాని తర్వాత ఒక పరీక్షను రిగ్గింగ్ చేస్తున్నదని, దేశానికి వ్యతిరేకంగా ఇది కుట్ర కావొచ్చని ఆయన అనుమానించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిని శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ‘ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ’తో పోల్చారు. పరీక్షల రద్దు ఈ సమస్యకు పరిష్కారం కాదని, కేంద్రం, ఎన్టీఏ జవాబుదారీతనంతో ఉండాలని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే మాట్లాడుతూ… దేశంలో పరీక్షల వ్యవస్థ కుప్పకూలిందని, పేపర్ లీక్లతో పాటు అక్రమాలు హద్దుమీరిపోయాయని పేర్కొన్నారు. పనికిమాలిన ఎన్టీఏకు ఇందులో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమైనా మరోసారి కొనసాగించారని, ఇదే రకంగా అశ్వినీ వైష్ణవ్ను రైల్వే మంత్రిగా కొనసాగించగా ఇటీవలే రైలు ప్రమాదం జరిగిందన్నారు. వీరిద్దరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని చేశారు. నెట్ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని, అవకతవకలకు సంబంధించిన ఆధారాలు ఉన్నందున నీట్ను కూడా రద్దు చేయాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా డిమాండ్ చేశారు.