న్యూఢిల్లీ: లోక్సభలో మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగించారు.
ఆయన ప్రసంగానికి సిద్ధమవగానే ప్రతిపక్ష సభ్యులు ‘మణిపూర్.. మణిపూర్’, ‘తానాషాహి నహీ చలేగీ(నియంతృత్వం చెల్లదు)’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ నిలువరించేందుకు ప్రయత్నించినా ఇండియా కూటమి సభ్యులు నిరసనను కొనసాగించారు. ఒకానొక దశలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై స్పీకర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పరాన్నజీవి: మోదీ
కాంగ్రెస్ పారీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, మూడోసారి కూడా ఆ పార్టీ 100 సీట్ల మార్క్ను దాటలేకపోయిందని ఎద్దేవా చేశారు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారని అన్నారు. ఆ పార్టీకి వందకు 99 రాలేదని, 543 సీట్లకు 99 వచ్చాయని గుర్తు చేశారు. వారి స్ట్రైక్ రేట్ కేవలం 26 శాతం మాత్రమేనని, ప్రజా తీర్పును ఇకనైనా గౌరవించాలని కాంగ్రెస్ ఎంపీలకు హితవు పలికారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన చోట్ల ఎక్కువగా సీట్లు సాధించలేదని, పొత్తులతోనే ఎక్కువ స్థానాలు గెలిచిందని అన్నారు. పొత్తులో ఉన్న పార్టీల ఓట్లను తినేసే పరాన్నజీవిగా కాంగ్రెస్ మారిపోయిందని ఎద్దేవా చేశారు.
రాహుల్ది చిన్న పిల్లాడి ప్రవర్తన
సోమవారం రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బదులిస్తూ..‘నిన్న సభలో చిన్న పిల్లాడి ప్రవర్తనను చూశాం’ అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సానుభూతి పొందేందుకు డ్రామా చేస్తున్నారని విమర్శించారు. హిందూ సంస్కృతిని తిట్టడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని, ‘హిందూ ఉగ్రవాదం’ అని పదాలను కాంగ్రెస్ పలికిందని, ఆ పార్టీ మిత్రపక్షాలు హిందుత్వాన్ని మలేరియాతో పోల్చాయని, దేశం వారిని ఎన్నటికీ క్షమించదని పేర్కొన్నారు.
పేపర్ లీక్లను అరికడతాం: మోదీ
పేపర్ లీక్లను అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నదని, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.