PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పోలాండ్ (Poland), ఉక్రెయిన్ (Ukraine) దేశాల పర్యటనలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి ప్రధాని చేరుకున్నారు. పోలెండ్ పర్యటనలో భాగంగా.. ఇండియా, పోలాండ్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు బలం చేకూరుస్తూ పోలాండ్లో ప్రధాని పర్యటించారు. గత 45 ఏళ్లలో పోలాండ్లో పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం.
ఈ పర్యటనలో భాగంగా డోబ్రో మహరాజ్ మెమోరియల్, కొల్హాపూర్ మెమోరియల్, మోంటే కాస్సినో యుద్ధ స్మారకం సహా పలు మెమోరియల్స్ను మోదీ సందర్శించి నివాళులర్పించారు. భారత సంతతి ప్రజలను కలుసుకుని భారతదేశ ప్రగతి, వసుధైక కుటుంబం ఫిలాసఫీపై చర్చించారు. పోలిష్ ప్రధాని డోనాల్డ్ టస్క్ను కలుసుకుని, ఇండియా-పోలండ్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.
పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో సమావేశమయ్యారు. పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్ సభ్యులు, ఐడియాలజిస్టులను కలుసుకుని సాంస్కృతిక సంబంధాల మెరుగుపై మాట్లాడారు. పోలాండ్లో భారత క్రీడలను ప్రమోట్ చేసే అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా 1992లో దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఆగస్టు 23న కీవ్లో అడుగుపెట్టిన మోదీ.. అక్కడి ‘ఒయాసిస్ ఆఫ్ పీస్’ పార్క్లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
రష్యాతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు జెలెన్స్కీతో కలిసి నివాళులు అర్పించారు. బాధితులకు నివాళిగా ఒక ఆటబొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, జెలెన్స్కీ పాల్గొన్నారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వ్యవసాయ, మెడికల్ ప్రోడక్ట్ రెగ్యులేషన్, హ్యుమనిటేరియన్ అసిస్టెన్స్, సాంస్కృతిక మార్పిడి తదితర రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ వైద్య అవసరాలకు మద్దతుగా BHISHM క్యూబ్స్ (మెడికల్ కిట్స్) ను జెలెన్స్కీకి అందజేశారు.
కీవ్లో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో హిందీ నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులను కలుసుకుని వారితో సంభాషించారు. ఉక్రెయిన్ ప్రజలకు భారతీయ సంస్కృతిని చేరువ చేసే ప్రయత్నాలను అభినందించారు. ఉక్రెయిన్-రష్యా సమస్యలపై పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని, ఇందుకు ఎలాంటి సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీతో జరిపిన సంభాషణల్లో మోదీ భరోసా ఇచ్చారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Palam airport in Delhi after concluding his two-nation visit to Poland and Ukraine
(Source: DD News) pic.twitter.com/QCdCwqIDQT
— ANI (@ANI) August 24, 2024