న్యూఢిల్లీ, డిసెంబర్ 13: తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు-2023కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు గత వారమే లోక్సభ ఆమోదించింది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రానున్న రోజుల్లో ప్రాంతీయ ఆకాంక్షలను ఈ వర్సిటీ నెరవేర్చనుంది. ఈ యూనివర్సిటీ ఉన్నత విద్య అందుబాటును, నాణ్యతను, తెలంగాణ ప్రజల పరిశోధనా సౌకర్యాలను పెంపొందిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. భారతదేశ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలపై ఈ యూనివర్సిటీలో పరిశోధనలు చేసే అవకాశం లభించనుంది. ఈ యూనివర్సిటీని రూ.889.07 కోట్లతో నెలకొల్పనున్నారు.
ఇందుకోసం ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. బిల్లు ఆమోదం పొందిన సమయంలో పార్లమెంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా ఐఐటీలు, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల డ్రాపౌట్ రేటు పెరుగుతున్నదని సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ వారికి వేరే మంచి అవకాశాలు రావడం, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభించడం ఇందుకు ఒక కారణమని తెలిపారు.