జైపూర్: పలు రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ లీక్లతో (Paper Leak) సంబంధం ఉన్న మహిళతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతాల్లో వారు ఉన్నట్లు తెలుసుకుని పక్కా ప్లాన్తో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లో నిర్వహించిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్తో సహా పలు పోటీ పరీక్షల ‘పేపర్ లీక్ మాఫియా’ ప్రధాన సూత్రధారి జగదీష్ బిష్ణోయ్ను గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడి అనుచరుడు ఓంప్రకాష్ ఢాకా, ఇతర నిందితులు షమ్మీ బిష్ణోయ్, సునీల్ బిష్ణోయ్ అరెస్ట్ కోసం నెల రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓంప్రకాష్ అరెస్ట్ కోసం రూ. 75,000, బిష్ణోయ్ అరెస్టు కు రూ.70,000, బెనివాల్ అరెస్టు కోసం రూ. 25,000 రివార్డు ప్రకటించారు.
కాగా, 2022 డిసెంబర్లో జరిగిన సీనియర్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో నిందితుడైన ఓంప్రకాష్ ఢాకా షరతులతో లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి షరతులకు పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో అండర్గ్రౌండ్లోకి వెళ్లిన అతడి కోసం పోలీసులు వెతకసాగారు.
మరోవైపు ఓంప్రకాష్, సునీల్ కలిసి హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో రాజస్థాన్ పోలీస్ బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఎల్పీజీ సిలిండర్ డెలివరీ బాయ్స్గా పోలీసులు నటించారు. ఆ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో షమ్మీ ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన షమ్మీ డమ్మీ అభ్యర్థిగా పలు పరీక్షల్లో పాల్గొన్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.