కటక్: ఆరేండ్ల బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో ఉరిశిక్ష పడ్డ దోషి శిక్షాకాలాన్ని ఒడిశా హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. నిందితుడు దేవుడికి అంకితమైపోయి రోజూ పలుసార్లు ప్రార్థనలు చేస్తున్నందున అతడి శిక్షను తగ్గిస్తున్నట్టు పేర్కొంది.
అలాగే ఈ కేసులో మరో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. 2022లో ఒక బాలికపై లైంగిక దాడి చేయడమే కాక, ఆమెను హత్యచేసిన కేసులో ఆసిఫ్ అలీ (37), అఖిల్ అలీ (38)లకు మరణ శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. తాజాగా హైకోర్టు దానిని జీవితఖైదుగా మార్చింది. ‘నిందితుడు ప్రతిరోజూ అనేక పర్యాయాలు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు.
తాను దేవుడికి లొంగిపోయినందున ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు’ అని జస్టిస్లు సాహూ, ఆర్కే పట్నాయక్ పేర్కొన్నారు. అందుకే అతడి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నట్టు తీర్పు చెప్పారు. బాధితురాలి కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని అందించాలని ఆదేశించారు.