న్యూఢిల్లీ: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ నియమావళి ప్రకారం ఎలా సభలో ప్రవర్తించాలన్న విషయాన్ని ఆయన ఎంపీలకు సూచించారు. ఉత్తమ విధానాలు పాటించేందుకు సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా అర్థరహితమైన ప్రసంగాన్ని చేసినట్లు ఆరోపించారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడుతూ.. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం వ్యవహరిస్తున్న తీరును మోదీ ఖండించారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంటరీ సమస్యలపై స్టడీ చేయాలని ప్రధాని సూచించినట్లు చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్లో రెగ్యులర్గా ప్రస్తావించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని మంత్రి రిజిజు తెలిపారు.
ఎన్డీఏ కూటమి మీటింగ్లో మోదీని సన్మానించినట్లు రిజిజు చెప్పారు. మూడవసారి చరిత్రాత్మక విజయం సాధించినట్లు తెలిపారు. మీడియాలో కామెంట్ చేయడానికి ముందు ఆ సమస్య గురించి స్టడీ చేయాలని మోదీ సూచించినట్లు రిజిజు చెప్పారు. ప్రధాని మ్యూజియంను కూడా ఎంపీలు అందరూ సందర్శించాలని, అందరి ప్రధానుల జీవిత చరిత్రలకు చెందిన డాక్యుమెంట్లు ఉంటాయని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని మోదీ చెప్పారని రిజిజు తెలిపారు.