న్యూఢిల్లీ: నిన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) తన తీరును మార్పుకున్నది. ఇకపై పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. తాజాగా ప్రతిపక్షాల చెంతకు చేరింది. వారితో కలిసి రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. (BJD Joins Opposition) బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు బీజేడీ మద్దతు ఇచ్చింది. ప్రధాని మోదీ రెండో ప్రభుత్వం హయాంలో పలు కీలక బిల్లుల ఆమోదానికి సహకరించింది. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన బిల్లు, ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ), సమాచార హక్కు చట్టానికి సవరణలు, ఢిల్లీ అధికారులపై లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి నియంత్రణ కల్పించిన చట్టం వంటి అనేక వివాదస్పద బిల్లులకు పూర్తి మద్దతు ఇచ్చింది. అత్యవసర సమయంలో బీజేపీకి అత్యున్నత మిత్రపక్షంగా బీజేడీ వ్యవహరించింది.
కాగా, 24 ఏళ్ల పాటు ఒడిశాకు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఇటీవల జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని చవి చూసింది. 12 ఎంపీ సీట్లలో ఓటమితోపాటు ఒడిశాలో అధికారాన్ని కోల్పోయింది. దీంతో ఒడిశాలో చాలా కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేడీ తన తీరును మార్చుకున్నది. ఇకపై పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. ప్రతిపక్షాలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తింది.
బుధవారం రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇచ్చిన ఆయన యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీపై విమర్శలు చేశారు. ‘ఈ వ్యక్తులు ఆటో పైలట్, రిమోట్ పైలట్తో ప్రభుత్వాన్ని నడపడానికి అలవాటు పడ్డారు. వారికి పని చేయడంపై నమ్మకం లేదు, ఎలా వేచి ఉండాలో వారికి తెలుసు’ అని విమర్శించారు. దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. మల్లికార్జున్ ఖర్గే జోక్యానికి రాజ్యసభ ఛైర్మన్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
మరోవైపు ఆశ్చర్యంగా బీజేడీకి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీలు కూడా ప్రతిపక్షాల పక్షాన చేరారు. వారితో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. ‘ఇకపై బీజేపీకి మద్దతు లేదు. వ్యతిరేకత మాత్రమే’ అని బీజేడీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర తెలిపారు. ఒడిశా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఒడిశా డిమాండ్లను ఎన్డీయే ప్రభుత్వం విస్మరిస్తే బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తమకు సూచించినట్లు ఆయన చెప్పారు.