ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బలహీనంగా ఉందని, ఆగస్ట్లో మోదీ సర్కార్ కుప్పకూలుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందించారు. దేశాన్ని ముందుకు నడిపిస్తారనే విశ్వాసంతో దేశ ప్రజలు, బిహార్ ప్రజలు మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని పేర్కొన్నారు.
బిహార్ ప్రజలకు ప్రధాని మోదీ, నితీష్ కుమార్, ఎన్డీయే-బీజేపీ పట్ల పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. బిహార్ ప్రజలు ఆటవిక పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) కేంద్రంలోని మోదీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదని, ఆ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టులో మోదీ సర్కారు కూలిపోయే అవకాశం ఉన్నదని, కాబట్టి ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత రెండు పర్యాయాల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండేది. ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ దక్కలేదు. దాంతో మిత్రపక్షాలతో కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బలహీన సంకీర్ణ సర్కారు ఏ క్షణమైనా కూలిపోతుందని లాలూ అంచనా వేశారు.
Read More :