పాట్నా, జూన్ 29: కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షమైన జేడీయూ నుంచి అప్పుడే సెగ మొదలైంది. బీహార్కు ప్రత్యేక క్యాటగిరీ హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేడీయూ పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝాను నియమిస్తూ సమావేశం నిర్ణయం తీసుకొన్నది.
పోటీ పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని జేడీయూ డిమాండ్ చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ తీర్మానం చేసింది. కేంద్రంలో బీజేపీ ఈసారి టీడీపీ, జేడీయూ పార్టీలపై అధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకొన్నది.