న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన రషీద్ ఇంజినీర్కు (Rashid Engineer) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. అయితే మీడియాతో మాట్లాడ కూడదని షరతు విధించింది. కాగా, షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జమ్మూకాశ్మీర్కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు రషీద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. టెర్రరిస్టులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింది ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.