TRAI | న్యూఢిల్లీ: మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సిమ్ స్వాప్, రీప్లేస్మెంట్లో మోసాలను అరికట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం, సిమ్ స్వాప్ లేదా రీప్లేస్మెంట్ అంటే, ప్రస్తుత సబ్స్ర్కైబర్ తాను పోగొట్టుకున్న లేదా పని చేయని సిమ్ కార్డుకు బదులుగా కొత్త సిమ్ కార్డును తీసుకునే ప్రక్రియ.
యూజర్లు దేశంలోని ఒక యాక్సెస్ ప్రొవైడర్ నుంచి మరొక యాక్సెస్ ప్రొవైడర్కు మారినప్పటికీ, తమ మొబైల్ నెంబర్ను యథాతథంగా కొనసాగించుకోవడానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అవకాశం కల్పిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సదుపాయాన్ని కూడా యూజర్లు పొందవచ్చు.
మొబైల్ నెంబర్ సిమ్ స్వాప్ లేదా రీప్లేస్మెంట్ తేదీ తర్వాత ఏడు రోజులు పూర్తి కాకుండా యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ) కోసం రిక్వెస్ట్ చేస్తే, ఆ రిక్వెస్ట్ను తిరస్కరించాలని తాజా నిబంధనలు చెప్తున్నాయి. ఈ గడువు గతంలో పది రోజులు ఉండేది. ఈ పది రోజుల వ్యవధి సరైనదేనని కొందరు చెప్పారని, మరికొందరు మాత్రం దీనివల్ల అర్జెంట్ పోర్టింగ్ అవసరమైన సమయాల్లో సబ్స్ర్కైబర్లకు అసౌకర్యంగా ఉంటుందని, దీనిని రెండు లేదా నాలుగు రోజులకు కుదిస్తే సహేతుకంగా ఉంటుందని చెప్పారని ట్రాయ్ తెలిపింది. అందుకే దీనిని ఏడు రోజులకు తగ్గించినట్లు వివరించింది.