New Criminal Laws | కేంద్రం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి తీసుకువచ్చేందుకు హోంమంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇందు కోసం 40లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చింది. దాంతో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించబోతున్నది. కేంద్రం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య పేరులతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. బ్రిటిష్ కాలంనాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో జూలై నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. మూడు కొత్త చట్టాలపై 5.65 లక్షల మంది పోలీసులు, జైలు, ఫోరెన్సిక్, జ్యుడీషియల్, ప్రాసిక్యూషన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.
కొత్త క్రిమినల్ చట్టాలు దర్యాప్తు, విచారణ, కోర్టు విచారణలో సాంకేతికత నొక్కి చెప్పగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రస్తుత క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ (CCTNS) అప్లికేషన్లో 23 సవరణలు చేసింది. దీని కింద ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ని కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్సీఆర్బీ కొత్త వ్యవస్థ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయాన్ని సైతం అందిస్తుంది. కొత్త క్రిమినల్ చట్టాల అమలులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిరంతరం సహాయం చేయడానికి ఇది 36 సహాయక బృందాలు, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPR&D) సామర్థ్యం పెంపుదల కోసం శిక్షణా మాడ్యూల్స్ను రూపొందించింది. బ్యూరో 250 శిక్షణా కార్యక్రమాలు, వెబ్నార్స్, సెమినార్లను కూడా నిర్వహించింది, ఇందులో 40,317 మంది అధికారులు, సిబ్బంది శిక్షణ పొందారు.