NEET-PG | నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల వివాదం నేపథ్యంలో నీట్-పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ – పీజీ పరీక్షను (NEET-PG Exam) ఈ నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. హోం మంత్రిత్వ శాఖ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ సైబర్ క్రైమ్ నిరోధక సంస్థ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని సదరు వర్గాలు తెలిపాయి. అదేవిధంగా నీట్ పీజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని (Question Papers) పరీక్షకు రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు పేర్కొన్నాయి. అయితే పరీక్షను నిర్వహించే తేదీని మాత్రం సదరు వర్గాలు వెల్లడించలేదు.
కాగా, నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీక్ అయ్యిందని, అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో నీట్-పీజీ పరీక్షను కూడా రద్దు చేశారు. దేశవ్యాప్తంగా జూన్ 23న ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే ) వాయిదా వేసింది. పలు పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవలి ఆరోపణల నేపథ్యంలో నీట్-పీజీ పరీక్ష ప్రక్రియ పటిష్టతను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది. కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని అప్పట్లో వెల్లడించింది.
ఎన్టీయే డైరెక్టర్పై వేటు
మరోవైపు నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఎన్టీయే డైరెక్టర్ సుబోధ్కుమార్ను కేంద్రం విధుల్లో నుంచి తొలగించింది. ఆయన స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవిలో కొనసాగుతారు.
రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా సుబోధ్ కుమార్ సింగ్ మీడియాకు దూరంగా ఉండేవాడని, లో ప్రొఫైల్ లో కొనసాగేవాడని సమాచారం.ఉత్తరప్రదేశ్ కు చెందిన సుబోధ్ కుమార్ సింగ్.. ఐఐటీ రూర్కేలాలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇగ్నో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గతేడాది జూన్ లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అదనపు సెక్రటరీగా పని చేశారు. ఛత్తీస్ గఢ్ సెక్రటేరియట్ లో 2009-2019 మధ్య పలు హోదాల్లో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి.
Also Read..
Hyatt Regency | ఫైవ్ స్టార్ హోటల్లో కూలిన షెడ్డు.. దంపతుల తలకు గాయాలు
Rahul Gandhi | లోక్సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు